1
|
“తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి. |
2
|
వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి. |
3
|
బలిపీఠం పైభాగాన్ని, అన్ని ప్రక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి. |
4
|
నగిషీబద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు నాలు ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి. |
5
|
తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి. |
6
|
ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఒడంబడిక పెట్టెను తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకోనే చోటు ఇదే.” |
7
|
“ప్రతీ ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి. |
8
|
మరల సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది. |
9
|
ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని, దహన బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్పించేదుకు బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.” |
10
|
“సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు ఒక ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహవాకు అతి ప్రత్యేక దినం.” |
11
|
మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, |
12
|
“ఎంత మంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు, ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా, ప్రతి వ్యక్తీ తనకోసం యెహోవాకు పన్ను చెల్లించాలి. ప్రతి వ్యక్తీ ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభంవిచదు. |
13
|
లెక్కించబడ్డ ప్రతి మనిషీ అరతులం చెల్లించాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, అధికార తులం అంటే 20 గొర్రెలు). ఈ అరతులం యెహోవాకు అర్పణం |
14
|
లెక్కించబడి, 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయసుగల ప్రతి వ్యక్తీ యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి. |
15
|
ధనికులు అరతులం కంటె ఎక్కువ చెల్లించకూడదు. ప్రజలందరూ ఒకే అర్పణ యెహోవాకు చెల్లించాలి. ఇది మీ ప్రాణం కోసం చెల్లించే అర్పణ. |
16
|
ఇశ్రాయేలు ప్రజల దగ్గర్నుండి ఈ సొమ్ము పోగుచేయి. సన్నిధి గుడారంలో సేవకోసం ఈ సొమ్ము ఉపయోగించు. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల నిమిత్తం చెల్లిస్తారు.” |
17
|
మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, |
18
|
“ఇత్తడి గంగాళం ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో నింపు. |
19
|
ఈ గంగాళంలోని నీళ్లతో అహరోను, అతని కుమారులు వారి కాళ్లు చేతు లు కడుక్కోవాలి |
20
|
సన్నిధి గుడారం ప్రవేశించేటప్పుడు, లేక బలిపీఠం సమీపించేటప్పుడు ప్రతిసారీ వారు నీళ్లతో కడుక్కోవాలి. ఈ విధంగా వారు మరణించరు. |
21
|
మరియు తమ చావకుండా ఉండేందుకు వారు తమ కాళ్లు చేతులు కడుక్కోవాలి. అహరోనుకీ, అతని ప్రజలకీ ఎప్పటికీ కొనసాగే చట్టం యిది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి వాళ్లందరికీ యిది కొనసాగుతుంది.” |
22
|
అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: |
23
|
“శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసనగల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు, |
24
|
500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె తీసుకో. |
25
|
“ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నింటినీ కలపాలి. |
26
|
సన్నిధి గుడారం మీద, ఒడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి, వీటికి ఒక ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది. |
27
|
బల్లమీద, బల్లమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి. |
28
|
ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద ఈ తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం పోయి. |
29
|
వీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది పవిత్రం అవుతుంది. |
30
|
“అహరోను, అతని కుమారుల మీద ఈ తైలంపోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నా సేవ చేయవచ్చు. |
31
|
అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. |
32
|
సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల ప్రత్యేకమైనదిగా ఉండాలి. |
33
|
ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి యిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి. |
34
|
అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకరా! జటామాంసి, గోపి చందనం, గంధపుచెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి. |
35
|
సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది. |
36
|
ధూప ద్రవ్యంలో కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెట్టె ఎదుట ఆ పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి. |
37
|
యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంకే యితరమైన ధూపం చేయడానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు. |
38
|
ఒక వ్యక్తి, తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.” |
Exodus 30:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...