1
|
ఈ మెల్కీసెదెకు షాలేము రాజు; మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. |
2
|
అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు. మొదటిదిగా ‘మెల్కీసెదెకు’ అనే పదానికి నీతికిరాజు అనే అర్థం. రెండవదిగా ‘షాలేమురాజు’ అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. |
3
|
మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వీకులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించికాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడిగా ఉంటాడు. |
4
|
మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించిన దానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి, |
5
|
ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందిన వాళ్ళు. లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించిన దానిలో పదవవంతు సేకరించాలని ఉంది. |
6
|
మెల్కీసెదెకు లేవి జాతికి చెందిన వాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. |
7
|
ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. |
8
|
ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. |
9
|
ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. |
10
|
ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు. |
11
|
మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? |
12
|
దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, |
13
|
ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపు వాడు. ఆ గోత్రానికి చెందిన వాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. |
14
|
మన ప్రభువు యూదా వంశానికి చెందిన వాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపు వాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు. |
15
|
పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. |
16
|
మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. |
17
|
ఎందుకంటే, ‘నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు’ అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి. |
18
|
పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. |
19
|
ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. |
20
|
దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతా వాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. |
21
|
. కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు: ‘ప్రభువు ప్రమాణం చేశాడు. తన మనస్సును మార్చుకోడు: ‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.”‘ కీర్తన 110:4 |
22
|
ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్టమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు. |
23
|
ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. |
24
|
కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. |
25
|
అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోవటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు. |
26
|
పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధాన యాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. |
27
|
ఆయన, ఇతర ప్రధాన యాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! |
28
|
ధర్మశాస్త్రం బలహీనులైన వాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధాన యాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు. |
Hebrews 7:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...