అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది.
యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు.
నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”
“యిర్మీయా, యూదా ప్రజలకు ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడని తెలియజేయుము: ‘ప్రతి ద్రాక్షరసపు తిత్తియు ద్రాక్షారసముతో నింపాలి. అది విన్న ఆ జనులు నవ్వి, ‘అవును. ప్రతి ద్రాక్షారసపు తిత్తీ ద్రాక్షారసంతోనే నింపాలని మాకు తెలుసు’ అని నీతో అంటారు.
అప్పుడు నీవిలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: ఈ రాజ్యంలో నివసించే ప్రతివాని తాగిన వానిలా నిస్సహాయుని చేస్తాను. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను యాజకుల గురించి, ప్రవక్తల గురించి యెరూషలేము వారందరిని గురించి నేను మాట్లాడుతున్నాను.
యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.”‘ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది “‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.”‘
మీ యెహోవా దేవుని గౌరవించండి. ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు. మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనను స్తోత్రం చేయండి. యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు. కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు. యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు.
యూదా ప్రజలారా, మీరు యెహోవా వాక్కు వినకపోతే నేను దాగుకొని విలపిస్తాను. మీ గర్వం నన్ను విలపించేలా చేస్తోంది. నేను బిగ్గరగా విలపిస్తాను. నా కన్నీరు వరదలై పారుతుంది. ఎందువల్లనంటే, యెహోవా మంద బందీయైపోయింది.
ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి చెపుతావు? నీవు దేవుని గురించి ప్రజలకు బోధించవలసివుంది. నీ నాయకులు ప్రజలను నడిపించవలసి ఉంది. కాని వారి పని వారు చేయ లేదు! కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను అనుభవిస్తావు. నీ బాధ స్త్రీ యొక్క ప్రనవవేదనలాంటిది.
“నాకెందుకీ చెడు దాపురించింది?” అని నీకు నీవే ప్రశ్నించుకో. నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు. నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది. నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి. నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు.
నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి పనులు చేయలేవు. నీవు ఎల్లప్పుడూ చెడు చేయటానికే అలవాటడ్డానావు.
“మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను. మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని వైపులకూ పారిపోతారు. ఎడారి గాలికి కొట్టుకు పోయే పొట్టులాంటి వారు మీరు.
ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి. నా ప్రణాళికల్లో నీ పాత్ర ఇదే.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “ఇది ఎందుకు సంభవిస్తుంటే నీవు నన్ను మర్చిపోయావు. నీవు బూటకపు దేవుళ్ల నమ్మావు.
నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను . నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను. వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు. నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను. యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది. అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.”