ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడు అగు ఇష్మాయేలు ఏడవ మాసంలో అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చాడు. అతనితో తమ మనుష్యులు పదిమంది ఉన్నారు. వారు మిస్పా పట్టణానికి వచ్చారు. ఇష్మాయేలు రాజ కుటుంబంలో ఒక సభ్యుడు. యూదా రాజు అధికారులలో ఒకడు. ఇష్మాయేలు, అతని మనుష్యులు గెదల్యాతో కలిసి భోజనం చేశారు.
వారంతా కలిసి భోజనం చేస్తూవుండగా, ఇష్మాయేలు మరియు అతని పదిమంది మనుష్యులు లేచి అహీకాము కుమారుడైన గెదల్యాను కత్తితో పొడిచి చంపారు. గెదల్యా యూదా పాలకుడుగా బబులోను రాజుచే ఎంపిక చేయబడిన వ్యక్తి.
ఆ ఎనభై మందిని కలవటానికి ఇష్మాయేలు మిస్పా పట్టణం నుండి వారికి ఎదురేగాడు. అతడు వారిని కలవటానికి వెళుతూ రోదించాడు . ఇష్మాయేలు ఆ ఎనభై మంది మనుష్యులనూ కలిసి కొని, “నాతో రండి. మనం అహీకాము కుమారుడైన గెదల్యాను కలుద్దాము” అని చెప్పాడు.
ఆ ఎనభై మంది మిస్పా పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు ఇష్మాయేలు, అతని మనుష్యులు కలిసి ఆ వచ్చిన వారిలో డెబ్బయి మందిని చంపివేశారు. వారా శవాలను నీళ్లను నిల్వచేయటానికి నిర్మించిన నూయి వంటి గోతిలో పడవేశారు.
కాని మిగిలిన పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపవద్దు! మావద్ద గోధుమ, యవధాన్యాలు ఉన్నాయి. మావద్ద తైలము, తేనె కూడ ఉన్నాయి. వాటిని మేమొక పొలంలో దాచాము (వాటిని మీకు ఇస్తాము)” అని చెప్పారు. అందువల్ల ఇష్మాయేలు ఆ పది మందినీ వదిలి పెట్టాడు. ఇతరులతో పాటు అతడు వారిని చంపలేదు.
(ఈ నీటి గొయ్యి చాలా పెద్దది. ఆసా అనే యూదా రాజుచే అది నిర్మించబడింది. యుద్ధ కాలంలో నీటిని నిలువచేయటానికి రాజైన ఆసా దానిని నిర్మింప చేశాడు. ఇశ్రాయేలు రాజైన బయషా నుండి తన పట్టణాన్ని రక్షించుకోవటానికి ఆసా ఇలా చేశాడు. అయితే ఇష్మాయేలు మాత్రం ఆ గొయ్యి నిండేవరకు దానిలో శవాలను పడవేశాడు.)
మిస్పా పట్టణంలో ఉన్న ఇతర ప్రజలందరినీ ఇష్మాయేలు పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వారిలో రాజు కుమార్తెలు మరియు అక్కడ మిగిలియున్న ఇతర ప్రజలు వున్నారు. ఎవరినైతే నెబూజరదాను పాలించమని గెదల్యాను నియమించాడో, వారే ఆ ప్రజలు. నెబూజరదాను బబులోను రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి. ఇష్మాయేలు తాను పట్టుకున్న ప్రజలను తీసికొని అమ్మోను దేశానికి పోవటానికి బయలు దేరాడు.
కావున యోహానాను, అతనితో వున్న సైన్యాధికారులు తమ సైనికులను వెంట తీసికొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎదుర్కోవటానికి వెళ్లారు. గిబియోను వద్ద గల పెద్ద చెరువు దగ్గర వారు ఇష్మాయేలును పట్టుకున్నారు.
ఆ విధంగా కారేహ కుమారుడైన యోహానాను, సైనికాధికారులు బందీలను రక్షించారు. ఇష్మాయేలు గెదల్యాను హత్య చేసి ఆ ప్రజలను మిస్పా పట్టణంలో పట్టుకున్నాడు. బతికి బయటపడిన వారిలో సైనికులు, స్త్రీలు, పిల్లలు మరియు న్యాయాధికారులు వున్నారు, యెహానాను వారిని గిబియోను పట్టణం నుండి తిరిగి తీసికొని వచ్చాడు.