వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు.
జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:
తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,
యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.)
వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులగా సేవ చేయలేకపోయారు.
వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.
ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు.
ఈ విధంగా యాజకులు, లేవీ గొత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమతమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.