యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు నీవు భయపడవద్దు! అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు. కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవి కావు. వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు. వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో కొట్టి మలుస్తాడు.
బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి. వారి విగ్రహాలు మాట్లాడవు. వారి విగ్రహాలు నడవలేవు. ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి! కావున ఆ విగ్రహాలకు భయపడకు. అవి నిన్ను ఏమీ చేయలేవు. పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”
ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు. వారందరి గౌరవానికి నీవు అర్హుడవు. ప్రపంచ దేశలలో చాలామంది జ్ఞానులున్నారు. కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.
వారు తర్షీషు నగరంనుండి వెండిని, ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు. విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి. ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. “జ్ఞానులు” ఆ “దేవుళ్ల”ని చేస్తారు.
కాని యెహోవా నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. దేవునికి కోపం వచ్చి నప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల ప్రజల ఆయన కోపాన్ని భరించలేరు.
భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు. ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు. భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు. ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు. ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.
కాని యాకోబు యొక్క దేవుడు ఆ విగ్రహాలవంటి వాడు కాదు. ఆయన సర్వసృష్టికి కారకుడు. ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు. ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”
యెహోవా ఇలా చెప్పాడు, “ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను. వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను. వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను .”
నా గుడారం పాడైపోయింది. దాని తాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నన్ను వదిలేశారు. వారు వెళ్లిపోయారు. నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు. నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు.
గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు! వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు, వారు జ్ఞాన శూన్యులు. అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదరై తప్పిపోయాయి.
ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము! ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది. అది యూదా నగరాలను నాశనం చేస్తుంది. యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.
యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు. జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు. ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.
నీకు కోపంవస్తే, అన్యదేశాలను శిక్షించుము. వారు నిన్నెరుగరు; గౌరవించరు. ఆ ప్రజలు నిన్ను పూజించరు. ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి. వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు. వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.